CPI leader Narayana make hot comments on Prime Minister Narendra Modi over poll promises to Andhra Pradesh.
ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఐ నేత నారాయణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనను దుయ్యబట్టడంతో పాటు నవ్యాంధ్ర ప్రదేశ్కు కేంద్రం సహకారం లేకపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులకు మరో రూపం మోడీ అని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి విభజన సమయంలో హామీల కోసం అందరు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాత కక్షలు ఉన్నాయని, ఆ కక్షను ప్రధాని ఇప్పుడు ఏపీ ప్రజల పైన తీర్చుకుంటున్నారని నారాయణ ఘాటుగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, హోదా మాత్రమే కావాలని కుండబద్దలు కొట్టారు.
కాగా, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నాడు గుజరాత్ సిఎంగా ఉన్న మోడీపై విమర్శలు చేశారు. దీనిని ఉద్దేశించే నారాయణ ఇలా వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం కోసం అఖిల సంఘాల భేటీ వేస్తామని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అంశం పైన కూడా నారాయణ స్పందించారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడేటట్టు అయితేనే అఖిలపక్షంతో కలుస్తామని, లేదంటే కలిసేది లేదన్నారు.
విభజన హామీలు అమలు చేయలేదంటూ టీడీపీ చేపడుతున్న నిరసనలను ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమర్థించారు. డిమాండ్లను నెరవేర్చాలని అడగడంలో తప్పు లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ అవశిష్టంగా మిగిలిపోయిందని, ఏపీకి ఎన్నో చేస్తామని చెప్పారని, కానీ అవేమీ నెరవేరలేదని, ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నిలదీయడంలో తప్పు లేదన్నారు.