హైదరాబాద్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు యో యో పాసై భారత జట్టులో చోటు దక్కించుకుంటే మిడిలార్డర్ సమస్య తీరినట్లే అని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఆడిన రాయుడు ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్-2018లో రాయుడు 602 పరుగులు చేశాడు.ఐపీఎల్లో రాయుడు ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు నిర్వహించిన యో యో టెస్టులో రాయుడు విఫలమవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో రైనాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భారత్ మిడిలార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. రెండో వన్డేలో మిడిలార్డర్ విఫమవ్వడంతోనే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. బంగర్ మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు.